రోజురోజుకి సైబర్ నేరగాళ్ళ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. కరెంటు బిల్లులు, పోన్ బిల్లులు, బ్యాంక్ ఎసేమ్మేస్లు ఇలా ఎదో ఒకదారిలో ప్రజలను మోసం చేయడమే లక్యంగా పెట్టుకున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరలేపారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో వారు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాను మొదలెట్టారని.. మీ పేరిట ఫెడెక్స్లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు.
నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు సమర్పించుకోవద్దన్నారు. అనుమానం వస్తే దైర్యంగా పోలీసుల సహాయం తీసుకోవాలి అన్నారు.