మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆందోళన.. ఆ ప్రాంతాల మెట్రో సేవల కొరకు డిమాండ్

     Written by : smtv Desk | Mon, Feb 05, 2024, 12:32 PM

మేడ్చల్ మెట్రో సాధన సమితి  ఆందోళన.. ఆ ప్రాంతాల మెట్రో సేవల కొరకు డిమాండ్

హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత దూర ప్రాంతాల ప్రజలకు ప్రయాణం తెలికవడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణం సాధ్యం అవుతుంది. దీంతో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఉన్న మెట్రో రైలు సౌకర్యం తమకూ కావాలని శివారు ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ కోరిక నెరవేర్చాలంటూ మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. నిజానికి గత ప్రభుత్వం రెండో దశ విస్తరణలో కొంపల్లి, బోయినపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షామిర్‌పేట బొల్లారం ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పిస్తుందని భావించినా నిరాశే ఎదురైంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రణాళికను రద్దు చేయడంతో ఈసారి తమకు తప్పకుండా ప్రాధాన్యం లభిస్తుందని ఈ ప్రాంత ప్రజలు భావించారు. అయితే, ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మెట్రో సాధన సమితి తమకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతిపాదిత రెండోదశ మెట్రో లైనులో మేడ్చల్, కొంపల్లి, బోయినపల్లి, అల్వాల్, బొల్లారం, తూముకుంట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినపతిపత్రం సమర్పించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements