గత మూడేళ్ళుగా ఐటీ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానానికి అలవాటు పడిపోయారు. దీంతో కంపెనీలు ఇప్పుడు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలి అని కోరినప్పటికీ ఆఫీస్ కు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగులను ఆఫీసుకు రావాలని కోరిన దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్చి చివరికల్లా ఆఫీస్కు వచ్చి పని చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని ‘వర్క్ ఫ్రమ్ హోం’ చేస్తున్న ఉద్యోగులనుహెచ్చరించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రహ్మణ్యం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆఫీస్కు వచ్చి పనిచేసేందుకు ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించామని, గడువు తేదీ వివరాలను తమ ఉద్యోగులకు తెలియజేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు. కొవిడ్కు ముందు ఉన్న ‘వర్క్ మోడల్’ను తిరిగి ప్రవేశపెట్టాలని టీసీఎస్ యోచిస్తోందని ఆయన చెప్పారు.
ఇంటి నుంచి పనిచేయడంతో అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీకి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడం వెనక భద్రతా కారణాలు ఉన్నాయని, సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని సుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. వర్క్ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ఈ సవాళ్లను అధిగమించే అవకాశం ఉండదని చెప్పారు. కాగా, ఇటీవలే తమ సంస్థపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగిందని ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ కంపెనీ పేర్కొంది.