పేటీఎం యాప్‌పై ఆర్బీఐ కీలక ఆదేశాలు..

     Written by : smtv Desk | Sat, Feb 24, 2024, 09:00 AM

పేటీఎం యాప్‌పై ఆర్బీఐ కీలక ఆదేశాలు..

ప్రస్తుతం పేటీఎం యాప్‌‌పై యూపీఐ గురించి ప్రజలలో నెలకొన్న గందరగోళం గురించి తెలిసిందే. అయితే ఆర్బీఐ కఠిన ఆంక్షల కారణంగా పేటీఎం యూపీఐ లావాదేవీలపై సందిగ్దత కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పేటీఎం యాప్‌ను థర్డ్ పార్టీ అప్లికేషన్‌గా మార్చివేసి యూపీఐ విధానంలో కార్యకలాపాలు కొనసాగింపునకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ఎన్‌పీసీఐని (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆర్బీఐ కోరింది. ఇక పేటీఎం విభాగాలకు చెందిన ఖాతాలను 4-5 బ్యాంకులకు మార్చుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని అడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అకౌంట్స్‌లో కొత్తగా డిపాజిట్లు చేయడానికి వీల్లేదంటూ ఆర్బీఐ ఇటీవలే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే వినియోగదారులకు నిరంతరాయ డిజిటల్ చెల్లింపుల సేవలు అందించడమే లక్ష్యంగా పేటీఎంని థర్డ్ పార్టీ అప్లికేషన్‌గా మార్చే అవకాశాలన్ని పరిశీలించాలని ఎన్‌పీసీఐని ఆర్బీఐ సంప్రదించింది. పేటీఎం యాప్‌పై యూపీఐ సేవలను యథావిథిగా కొనసాగించేందుకు యాప్‌ని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా (టీపీఏపీ) మార్చడాన్ని పరిశీలించాలని కోరినట్టు స్పష్టత ఇచ్చింది.

ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్’ తమను అభ్యర్థించిందని ఆర్బీఐ తెలిపింది. పేటీఎం బ్యాంక్ అకౌంట్ల బదిలీ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా 4-5 బ్యాంకులను పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పీఎస్పీ) బ్యాంక్‌లను సూచించవచ్చనని, తద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది. కాగా వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లకు సంబంధించిన నోడల్ ఖాతాలు వీలైనంత త్వరగా రద్దు చేస్తారని తెలుస్తోంది. మార్చి 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది.





Untitled Document
Advertisements