ప్రస్తుతకాలంలో ప్రజలు చేతిలో డబ్బు ఉంచుకోవడం మానేసారు. కేవలం అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు అన్నట్టుగా మారింది. ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఆన్లైన్ చెల్లింపుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చాలాకాలంగా అమెజాన్ పే పేరిట యూపీఐ చెల్లింపు సేవలు అందిన్న విషయం విదితమే. అయితే తాజాగా ఇప్పుడు మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కూడా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు (ఆన్ లైన్, ఆఫ్ లైన్) చేయవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు ఫ్లిప్ కార్ట్ లో యూపీఐ ద్వారా కొనుగోళ్లకు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ ఫాంలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు సౌజన్యంతో సొంతంగా యూపీఏ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికోసం ఫ్లిప్ కార్ట్ యాప్ లో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది.
ప్రస్తుతానికి యూపీఐ సేవలను ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ లో కొనుగోళ్ళు చేసేవారు చెల్లింపుల కొరకు ఇకపై ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడాల్సిన అవసరం లేనట్టే.