పెరిగిన క్రెడిట్ కార్డు వాడకం.. మార్చిలో ఖర్చు లక్షకోట్లు!

     Written by : smtv Desk | Thu, Apr 25, 2024, 12:04 PM

పెరిగిన క్రెడిట్ కార్డు వాడకం.. మార్చిలో ఖర్చు లక్షకోట్లు!

క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. నిబంధనలు, క్రెడిట్ స్కోరు వంటివాటిని పట్టించుకోకుండా బ్యాంకులు ఎడాపెడా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తుండడంతో వినియోగదారులు కూడా వాటిని ఇష్టానికి వినియోగిస్తున్నారు. మార్చిలో ఏకంగా క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ చెల్లింపులు ఏకంగా రూ. 1,04,081 కోట్లు దాటేశాయి. గతేడాది ఇదే నెలలో రూ. 86,390 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పుడా ఖర్చు 20 శాతానికి పైగా పెరిగింది. ఫిబ్రవరిలో రూ. 94,774 కోట్లు ఖర్చు చేయగా మార్చిలో అది 10 శాతం పెరిగి రూ. 1,04,081 కోట్లకు చేరింది.

క్రెడిట్ కార్డు ఆఫ్‌లైన్ లావాదేవీలు (పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా) కూడా గతేడాదితో పోలిస్తే బాగా పెరిగాయి. నిరుడు ఇదే సమయంలో రూ. 50,920 కోట్లుగా ఉన్న ఆఫ్‌లైన్ లావాదేవీలు ఈసారి 19 శాతం పెరిగి రూ. 60,378 కోట్లకు చేరుకున్నాయి.

దేశంలోని క్రెడిట్ కార్డుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఫిబ్రవరిలో తొలిసారి 10 కోట్లు దాటేసి మార్చి నాటికి 10.2 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో దేశంలో 8.5 కోట్లు ఉండగా, ఇప్పుడది 20 శాతం పెరిగింది.

మొత్తం క్రెడిట్ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ వాటా 20.2 శాతం కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎస్‌బీఐ (18.5 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (16.6 శాతం), యాక్సిస్ బ్యాంక్ (14 శాతం) కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.8 శాతం) టాప్‌-10లో ఉన్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఇవి 90 శాతాన్ని ఆక్రమించాయి. ఏదేమైనా క్రెడిట్ కార్డ్ వినియోగంలో జాగ్రత్తలు వహించకుంటే మీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు అనే విషయం తప్పక గుర్తుంచుకోవలసిందే.





Untitled Document
Advertisements