మంత్రి రోజాకు ఎస్ బీఐ పురంలో చేదు అనుభవం.. అడ్డగించిన గ్రామస్థులు

     Written by : smtv Desk | Thu, Apr 25, 2024, 12:21 PM

మంత్రి రోజాకు ఎస్ బీఐ పురంలో చేదు అనుభవం..  అడ్డగించిన గ్రామస్థులు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం ఏమంత లేదు దీంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోజాను ముందుకు వెళ్లనీయలేదు. సర్దిచెప్పేందుకు చూసినా వారు వినిపించుకోకపోవడంతో చేసేదేంలేక మంత్రి రోజా వెనుదిరిగారు. వారి నిరసనల కారణంగా మంత్రి రోజా ఆ ప్రాంతంలో ప్రచారం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.





Untitled Document
Advertisements