7 నెలల్లో 7 వేలు పెరిగిన బంగారం ధర!

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 04:02 PM

7 నెలల్లో 7 వేలు పెరిగిన బంగారం ధర!

బంగారం ధర కొండెక్కుతోంది. ఎంతలా అంటే...జనవరి నెలలో రూ.32,000 స్థాయిలో కదలాడిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ.39,000 స్థాయిలో కదలాడుతోంది. అంటే 7 నెలల కాలంలో బంగారం ధర రూ.7,000 పెరిగింది. భారత్ బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల గ్లోబల్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా దేశంలో కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. అలాగే అమెరికా డాలర్‌తో రూపాయి మారక విలువ, దిగుమతి సుంకాలు వంటి అంశాలు కూడా ధరపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ మార్కె్ట్‌లో కూడా పుత్తడి ధర ఔన్స్‌కు 1,500 డాలర్ల పైకి చేరింది. ఇది 6 ఏళ్ల గరిష్ట స్థాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో బంగారం ధర ర్యాలీ చేసింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం జూలై నాటి బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీంతో బంగారం దిగుమతులు ప్రియం అవుతాయి. దీంతో బంగారం ధర కూడా పెరుగుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వు రానున్న కాలంలో వడ్డీ రేట్లను మరింత తగ్గించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి సాధనాలకు డిమాండ్ పెరుగుతుంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగినా, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగినా గ్లోబల్ ఆర్థిక వృద్ధి మరింత పడిపోవచ్చని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గుతాయని, సప్లై చైన్స్ దెబ్బతింటాయని పేర్కొంది. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక సాధనంగా చూస్తారు. దీంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి.





Untitled Document
Advertisements