జంతర: జమ్మూకశ్మీర్కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే 370, 35ఏ ఆర్టికల్స్ ను రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ పాకిస్థాన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని, భారత్లో కశ్మీర్ అంతర్భాగమని బల్ల గుద్ధినట్టు చెప్పారని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 370 అధికరణకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని అన్నారు.జార్ఖండ్లోని జంతరలో బుధవారంనాడు నిర్వహించిన జోహర్ జన్ ఆశీర్వాద్ యాత్రలో అమిత్షా మాట్లాడుతూ, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించేటప్పుడైనా 370 అధికరణపై తన వైఖరి ఏమిటో ప్రజలకు చెబితే బాగుంటుందని అన్నారు. తాము సర్జికల్ దాడులు జరిపినప్పుడు రాహుల్ వ్యతిరేకించారని, వాయిదాడులు జరిపితే సాక్ష్యాలు అడిగారని, దేశాన్ని ఏ దిశగా నడపాలని ఆయన అనుకుంటున్నారో ప్రజలకు ఇప్పుడైనా వివరణ ఇవ్వాలని అమిత్షా నిలదీశారు. పవిత్రమైన సంథాల్ పరగణ నుంచి తాము ప్రారంభించిన జన అశీర్వాద యాత్ర రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించే దిశగా తమను తీసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తాము రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి దిశగా మార్చివేశామని అన్నారు.