కేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రవర్తించిన తీరు పై అధికార బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు నిత్యం హింసను, ద్వేషాన్ని పెంపొదిస్తున్నారని, అబద్దాలు వ్యాప్తి చేస్తున్నారని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
నేను హిందువును.. అందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. హిందువులమైన మేము, రాహుల్ గాంధీ ఆరోపించినట్లుగా ద్వేషాన్ని వ్యాప్తి చేయమని, హింసకు పాల్పడమని, అబద్ధాలను ప్రచారం చేయమని తెలిపారు. కానీ హింసను, ద్వేషాన్ని ఆపాదిస్తూ కోట్లాదిమంది హిందువులను ప్రతిపక్ష నాయకుడు అవమానించారని మండిపడ్డారు.
హిందువులపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వంటి వారు ఎంతోమంది వచ్చి హిందుత్వాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. మా ధర్మం పట్ల.. మా విశ్వాసం పట్ల మా విధేయత బలంగా ఉంటుందన్నారు.