చిన్నారులకు కోవాగ్జిన్ అందించనున్న భారత్ బయోటెక్!

     Written by : smtv Desk | Wed, Sep 22, 2021, 10:38 AM

చిన్నారులకు కోవాగ్జిన్ అందించనున్న భారత్ బయోటెక్!

భారత్ బయోటెక్ సంస్థ చిన్నారులకు తీపికబురును అందించింది. కరోనా నియంత్రణకోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతోంది. ప్రస్తుతం 18 ఏళ్లు పూర్తైన వారికే అందించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది.
త్వరలో 18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ అందించేందుకు కోవాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2, 3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేశామని వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని పేర్కొంది.
భారత బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని, డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచుతామని తెలిపారు.
ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements