తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపధ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మరింత చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత కడుపుమంట ఎందుకని మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో సోమవారం ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మహబూబ్ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తనను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి తన రక్తం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో కాంగ్రెస్ వాళ్లు ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. తనకు వస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రైతుల సాగు నీటి కష్టాలు తీర్చడం కోసం గద్వాల నుంచి హైదరాబాద్ వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేశానన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం పని చేసిన తనపై రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ తీరు చూస్తున్న ప్రజలే ఓట్లతో అతనికి బుద్ది చెప్తారని మండిపడ్డారు.