బిహార్ ను భయాందోళనకు గురి చేస్తున్న పులి.. వేటకు సిద్దమైన హైదరాబాద్ షూటర్

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 04:40 PM

బిహార్ ను భయాందోళనకు గురి చేస్తున్న పులి.. వేటకు సిద్దమైన   హైదరాబాద్ షూటర్

ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని క్షణం ఒక యుగంగా బతుకు వెళ్లదీస్తున్నారు. కారణం.. మనిషి రక్తం రుచి మరిగిన ఓ రాయల్ బెంగాల్ టైగర్ వాళ్ళను వణికిస్తోంది. కాగా బిహార్ రాష్ట్ర ప్రజలను ఓ పులి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంత వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌ అడవుల పరిసర గ్రామాలను పులి తీవ్రంగా భయపెడుతోంది.
నరమాంస భక్షకిగా మారిన ఓ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ రెస్క్యూ బృందం నానా తంటాలు పడుతోంది.
స్థానిక బైరియా కాలా గ్రామం కేంద్రంగా నిపుణుల సాయంతో అటవీశాఖ సిబ్బంది పులి ఆచూకీ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా ఆ పులి తన స్థావరం మార్చుకొని, హరిహర్‌పుర్‌ గ్రామ చెరకు తోటల్లోకి చేరింది. గత నెల ఈ పులి అయిదుగురు గ్రామస్థులను చంపింది. దీన్ని పట్టుకునేందుకు నాలుగు ఏనుగులను కూడా రప్పించారు.
పులి భయంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. 150 మంది అధికారులు, సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్‌ నవాబ్‌ షఫత్‌ అలిఖాన్‌ కూడా రంగంలోకి దిగారు. పులిని పట్టుకునేందుకు ఓ బోనులో మేకను పెట్టగా.. తెల్లవారుజామున వేటగాళ్ల సమక్షంలోనే పులి చాకచక్యంగా మేకను పట్టుకుపోయింది.





Untitled Document
Advertisements