ఎన్నో వివాదాలు, మరెన్నో అడ్డంకుల నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహీ అన్నింటిని దాటుకుని ప్రాచారానికి సిద్దమైంది. వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ రథంలోకి ఎక్కారు. వారాహి పై నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. వారాహికి పూజల కోసం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కొండగట్టు చేరుకున్నారు.
కొండగట్టు ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ అభివృద్ధికి, లోక కళ్యాణానికి, కొండగట్టు అంజనేయ స్వామి ఆశీర్వాదం కోరుతూ పార్టీ ప్రచార రథానికి పండితులు పూజలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ను వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. తర్వాత పవన్ కల్యాణ్ తో పండితులు ఫొటోలు దిగారు.
కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ ను చూడడానికి పవన్ ఫ్యాన్స్ పోటెత్తారు. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ సందడితో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. వారాహికి పూజలు పూర్తయ్యాక వాహనంలోకి ఎక్కి అభిమానులు, కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. కాగా, ఉదయం 11 గంటలకే పవన్ కల్యాణ్ కొండగట్టు చేరుకోవాల్సి ఉండగా.. ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.