శ్రీలంకతో కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ అసాధారణ పోరాట పటిమని కనబర్చి భారత్ జట్టుని గెలిపించాడు. దీపక్ చాహర్ ఆటని చూసి మ్యాచ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పాకిస్థాన్ క్రికెటర్లు నేర్చుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ డ్యానిష్ కనేరియా సూచించాడు. ‘‘భారత్ జట్టుని గెలిపించిన ఘనత దీపక్ చాహర్దే. పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు అతని బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాలి. మ్యాచ్ని చివరి వరకూ చాహర్ తీసుకెళ్లగలిగాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్తో కలిసి స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. పరుగులు, బంతుల మధ్య అంతరం పెరగకుండా మధ్యమధ్యలో తెలివిగా బౌండరీలు కొట్టాడు. భువనేశ్వర్ కుమార్ మ్యాచ్లో చేసినవి 19 పరుగులే. కానీ.. అవి హాఫ్ సెంచరీతో సమానం’’ అని కనేరియా చెప్పుకొచ్చాడు.