త్రికూటం ఇదొక పర్వతం. మహా మేరు పర్వతానికి నాలుగు దిక్కులా 20 పర్వతాలు ఉన్నాయి. అందులో త్రికూటం ఒక్కటి. ఈ పర్వతం పైనే లంకానగరం నిర్మించబడి ఉంది. సర్ప రాజైన వాసుకికి, వాయుదేవుడికి ఎవరు శక్తి మంతులు అని ఒక తగువు వచ్చింది. వాసుకి తన శరీరంతో మహామేరువుని బిగించాడు. వాయువు తన శక్తినంతా ఉపయోగించినా అతని పట్టు నుండి మహా మేరువుని కదిలించలేకపోయాడు. కానీ, ఆ గాలికి దేవతలు భయపడి మహావిష్ణువుతో పాటు శివుడ్ని, బ్రహ్మను కుడా కలిసి వారిని అక్కడకు తీసుకువెళ్ళారు. శ్రీ మహావిష్ణువు ఇద్దర్ని పిలిచి పోటీ ఆపమని ఆదేశించగా వాసుకి తన బిగువును కొంత సడలించాడు. వాయువు శక్తికి త్రికూటం ఎగిరి దక్షిణ భారత దేశానికి దక్షిణాన గల సముద్రంలో పడింది. దానిపై విశ్వకర్మచే లంకా నగరం నిర్మించబడింది.