టీమిండియా క్యాంప్‌లో చేరిన కీపర్ రిషబ్ పంత్

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:44 PM

టీమిండియా క్యాంప్‌లో చేరిన కీపర్ రిషబ్ పంత్

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియాకి గుడ్‌న్యూస్. ఇటీవల కరోనా వైరస్ బారినపడిన రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని డర్హామ్‌లోని టీమిండియా క్యాంప్‌లో అడుగుపెట్టాడు. జూన్ 18 నుంచి 23 వరకూ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లకి 20 రోజుల బ్రేక్ ఇచ్చారు. ఈ విరామ సమయంలో యూరోకప్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియంకి వెళ్లిన రిషబ్ పంత్.. మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం విస్మరించి మరీ అభిమానులతో ఫొటోలు దిగాడు. దాంతో.. ఈ యువ వికెట్ కీపర్ కరోనా వైరస్ బారినపడిట్లు తెలుస్తోంది.

లండన్‌లోని తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న సమయంలోనే రిషబ్ పంత్‌కి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అక్కడే ఐసోలేషన్‌లో ఉన్న పంత్ కోలుకున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటివ్ రావడంతో.. డర్హామ్‌కి వెళ్లిన పంత్ అక్కడ టీమిండియా క్యాంప్‌తో చేరాడు. ప్రస్తుతం అక్కడ భారత జట్టు కౌంటీ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ శతకంతో ఫామ్‌ అందుకున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements