పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర వెలవెలబోయింది. నేలచూపులు చూసింది. పసిడి పడిపోయింది. బంగారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచిందని చెప్పొచ్చు.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX మార్కెట్లో శుక్రవారం రాత్రి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.25 శాతం తగ్గుదలతో 10 గ్రాములకు రూ.47,510కు క్షీణించింది. బంగారం ధర గత ఐదు సెషన్లలో ఏకంగా రూ.1000 మేర దిగివచ్చింది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.22 శాతం క్షీణతతో కేజీకి రూ.67,520కు తగ్గింది.
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరకు 10 గ్రాములకు రూ.46,500 వద్ద మద్దతు లభిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్థాయి కిందకు వస్తే.. పసిడి రేటు రూ.45,200 వరకు పతనం కావచ్చు. అదేసమయంలో రూ.48,500 వరకు నిరోధం ఉందని తెలిపారు. పసిడి రేటు ఈ స్థాయిని దాటితే.. మళ్లీ కొండెక్కనుందని పేర్కొంటున్నారు. దీపావళి నాటికి రూ.52,500కు చేరొచ్చని అంచనా వేశారు.