‘పోర్న్ రాకెట్’ కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఒకానొక సమయంలో పోలీసులకు లక్షల్లో లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యశ్ ఠాకూర్ మార్చి నెలలో ఏసీబీకి (అవినీతి నిరోధక శాఖ) ఈ విషయంపై ఓ మెయిల్ పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నారన్న సమాచారంతో ముంబయిలోని ఓ బంగ్లాపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా యశ్ ఠాకూర్ని సైతం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాజ్కుంద్రా పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, తనని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు.. ఈ కేసులో తన పేరు లేకుండా చేసుకునేందుకు రాజ్కుంద్రా అప్పట్లో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారంటూ మార్చి నెలలో యశ్ ఠాకూర్ ఏసీబీకి మెయిల్ పంపించినట్లు తాజాగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ‘పోర్న్ రాకెట్’ గుట్టు బయటపెట్టిన ఆ వీడియో షూట్.. కేవలం వెబ్సిరీస్ కోసమేనని.. పోర్న్ కాదని రాజ్కుంద్రా తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు.