ఇంగ్లాండ్ టూర్‌కి పృథ్వీ షా, సూర్యకుమార్‌

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 03:09 PM

ఇంగ్లాండ్ టూర్‌కి పృథ్వీ షా, సూర్యకుమార్‌

ఇంగ్లాండ్ టూర్‌కి భారత యువ ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ వెళ్లడం దాదాపు ఖాయమైంది. ఇంగ్లాండ్‌‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌ని విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ జట్టు అక్కడ ఆడనుంది. కానీ.. పర్యటనకి వెళ్లిన యువ ఓపెనర్ శుభమన్ గిల్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో పాటు స్టాండ్ బై బౌలర్‌గా ఉన్న అవేష్ ఖాన్ గాయపడి సిరీస్‌కి దూరమయ్యారు. దాంతో.. పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ జయంత్ యాదవ్‌లను పంపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడిన ఈ ఇద్దరూ ఆదివారం నుంచి గురువారం వరకూ మూడు టీ20ల సిరీస్‌లోనూ ఆడనున్నారు. అనంతరం ఇంగ్లాండ్‌కి బయల్దేరి వెళ్లనున్నారు. అలానే ప్రస్తుతం భారత్‌లో ఉన్న జయంత్ యాదవ్ కూడా ఈ ఇద్దరితో కలవనున్నాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ టూర్‌కి జంబో జట్టుని పంపిన బీసీసీఐ.. గాయపడిన ఆటగాళ్ల స్థానాల భర్తీకి ఎవరినీ భారత్ నుంచి పంపేది లేదని శుభమన్ గిల్ గాయపడిన సమయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కి స్పష్టం చేసింది. కానీ.. ముగ్గురు ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ కూడా వెనక్కి తగ్గింది. శుభమన్ గిల్ స్థానం భర్తీకి పృథ్వీ షా‌ని, వాషింగ్టన్ సుందర్ స్థానం భర్తీ కోసం జయంత్ యాదవ్‌ని పంపబోతున్న బీసీసీఐ.. అవేష్ ఖాన్‌కి రీప్లేస్‌గా మాత్రం ఎవరినీ పంపబోమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానెకి స్టాండ్ బై మాత్రమే సూర్యకుమార్‌ని పంపుతున్నట్ల కూడా బీసీసీఐ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.





Untitled Document
Advertisements