రుణభారంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం రంగం కోరుకుంటున్నట్లుగానే కేంద్రం భారీ ప్యాకేజీకి ప్రకటించింది. ముఖ్యంగా రూ.1 లక్ష కోట్లకుపైగా ఉన్న ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ఈ రంగానికి పెద్ద ఊరట లభించింది. దివాలా అంచున ఉన్న వొడాఫోన్ ఐడియా మనుగడకు తాజా ప్యాకేజీ ఉపకరించి, దేశంలో మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు, ఒక ప్రభుత్వ కంపెనీ ఆరోగ్యకరంగా పోటీపడే వీలు కలుగుతుంది. ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్దీకరణ, నూరుశాతం ఎఫ్డీఐ, బకాయిల చెల్లింపుపై మారటోరియం తదితర నిర్ణయాల్ని క్యాబినెట్ తీసుకున్నదని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ రంగంలో 9 వ్యవస్థాగత సంస్కరణల్ని చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెలికం రంగంపై తీసుకున్న నిర్ణయాల్ని వివరించారు.