దేశంలో సంచలనం సృష్టించిన అయోధ్య బాబ్రి మరియు రామమందిరం ఘటన తర్వాత మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో శివలింగం ఉంది అనే విషయం తెరపైకి వచ్చింది. అయితే మసీదు భవనంలో ఏ ప్రదేశంలో శివలింగాన్ని గుర్తించారనే విషయంలో యూపీ సర్కార్ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించగా, సర్వే నివేదికను తాము చూడలేదు అని తుషార్ మెహతా సమాధానమిచ్చారు. ఈ కేసులో కొన్ని అంశాలపై తన సహాయాన్ని కోర్టుకు అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. తురువాత విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, వారాణసీ సివిల్ జడ్జి తదుపరి ప్రొసీడింగ్స్పై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు సర్వే రిపోర్టును కమిషనర్ ఇంకా సమర్పించలేదని, అయినప్పటికీ కమిషనర్ బావిలో శివలింగాన్ని గుర్తించారని ప్రతివాదులు చెప్పడం పూర్తిగా ఆమోదనీయం కాదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ తన వాదననువినిపించారు. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో శివలింగాన్ని గుర్తించిన ప్రదేశాన్ని పరిరక్షించాలని, అయితే, నమాజ్ కోసం మసీదుకు వచ్చే భక్తులను అడ్డుకోవద్దని ఉత్తరప్రదేశ్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మసీదులో ప్రార్థనలకు 20 మందికి మించి అనుమతించవద్దని వారాణసీ కోర్టు సోమవారం జారీ చేసిన ఆదేశాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం పక్కన పెట్టింది. వారాణసీ పట్టణంలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో వీడియోగ్రఫీ సర్వేను ఆపేయాలంటూ అధికారులను ఆదేశించాలని కోరుతూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ముస్లింల ప్రార్థన హక్కుకు ఇబ్బంది కలిగించరాదని, అదే సందర్భంలో హిందూ భక్తులు పూజించే శివలింగాన్ని గుర్తించిన ప్రదేశాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. మసీదులో ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులను ఆదేశించింది. శివలింగం ఉందని చెబుతున్న బావి(వజూఖానా)ని ముస్లింలు మతపరమైన కార్యక్రమాలకు వినియోగించుకోవడంలోనూ ఆటంకాలు కలిగించ కూడదని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో వివరణాత్మక స్పందనలు తెలియజేయాలని యూపీ సర్కార్, హిందూ సేన తదితరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా కొందరు ముస్లిం సంఘాలకు చెందిన నాయకులు అక్కడ ఉన్నదీ శివలింగం కాదని అది కేవలం పౌంటేన్ మాత్రమేననే వాదన వినిపిస్తున్నారు.