ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈ-కామర్స్ సైట్లు నిర్వహించిన సేల్స్లో స్మార్ట్ఫోన్లు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. పండుగ సీజన్లో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు వెల్లువలా సేల్స్ నిర్వహిస్తన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్ , అమెజాన్ తో పాటు మిషో లాంటి మరికొన్ని సైట్స్ సేల్స్ జరిపాయి. ఆఫర్లను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఈ సేల్స్లో స్మార్ట్ఫోన్ ఆఫర్లు కస్టమర్లను చాలా ఆకర్షించాయి. దాదాపు అన్ని బ్రాండ్స్ మొబైళ్లపై డిస్కౌంట్లను ఇచ్చాయి ఈ-కామర్స్ సంస్థలు. బ్యాంక్ కార్డ్లపై అదనపు తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇలా కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను అమలు చేశాయి. ప్రజలు కూడా మునుపెన్నడూ లేని విధంగా స్మార్ట్ఫోన్లను కొన్నారు. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ , అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మొబైళ్ల అమ్మకాలు జోరుగా జరిగాయి. మొత్తంగా ఈ-కామర్స్ సైట్లలో సేల్స్ తొలి నాలుగు రోజుల స్మార్ట్ఫోన్ల అమ్మకాలపై గణాంకాలు బయటికి వచ్చాయి. ఇవి ఆశ్చర్యపరిచేలా విధంగా ఉన్నాయి. ఈ-కామర్స్ సేల్స్ తొలి నాలుగు రోజుల్లో ప్రతీ నిమిషానికి సగటున 1,100 స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ రిపోర్ట్ను వెల్లడించింది. నాలుగు రోజుల్లో ఏకంగా 60 లక్షల నుంచి 70 లక్షల మొబైల్స్ సేల్ అయ్యాయని పేర్కొంది. దీంతో ఈ-కామర్స్ సైట్ల గ్రాస్ మర్సండైజ్ వాల్యూమ్ ఏకంగా 10రెట్లు పెరిగిందని, దీంట్లో స్మార్ట్ఫోన్లదే అధిక భాగమని పేర్కొంది.“కొత్త లాంచ్లు, వాల్యూ ఆఫర్లు, అప్గ్రేడ్ ప్రోగ్రామ్స్తో మొబైల్స్ బాగా అమ్ముడయ్యాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 13, వన్ప్లస్ లాంటి ప్రీమియమ్ ఫోన్స్ ఈ-కామర్స్ సైట్లలో మొబైల్ సేల్స్ను మరింతగా ఊపందుకునేలా చేశాయి” అని రెడ్సీర్స్ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లు కూడా సేల్స్లో దుమ్మురేపాయి. కాగా, ఇప్పటికి ఫెస్టివల్ సీజన్ తొలి దశ సేల్స్ ముగుస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో సేల్స్ జరిగాయి. మింత్రా, నైకా, ఆజియో, మీషోతో పాటు పలు ఈ-కామర్స్ సైట్లలోనూ సేల్స్ నడిచాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు దీపావళి కోసం కూడా మరోసారి సేల్స్ను తీసుకురానున్నాయి.