రవీంద్ర సిన్హ్ అనిరుధ్సిన్హ్ జడేజా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసిసి వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ బౌలర్. రవీంద్ర జడేజా 2008-09 రంజీ ట్రోఫీ (42 వికెట్లు, 739 పరుగులు) లో చూపించిన బలమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అతను జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించాడు. అయితే రవీంద్ర జడేజాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. జడేజా భార్య రివాబా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, జడేజా సోదరి నైనబా కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా ఉన్నారు. అయితే రివాబా, నైనబా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
తాజాగా జడేజా సోదరి నైనబా స్పందిస్తూ, రివాబా ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం రివాబా చిన్నపిల్లలను వాడుకుంటోందని, ఇది బాలకార్మిక చట్ట వ్యతిరేకం అని నైనబా పేర్కొన్నారు.
అంతేకాదు, రాజ్ కోట్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటును కలిగివున్న రివాబా... జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎలా పోటీచేస్తారని, ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
రికార్డుల ప్రకారం రివాబా అధికారిక పేరు రివా సింగ్ హర్దేవ్ సింగ్ సోలంకి అని, కానీ బ్రాకెట్లో రవీంద్ర జడేజా పేరును ఉంచడం ద్వారా జడేజా అనే ఇంటిపేరును ఉపయోగించుకుంటోందని నైనబా ఆరోపించారు. రివాబా తన సోదరుడ్ని పెళ్లి చేసుకుని ఆరేళ్లయిందని, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా పేరును సవరించుకునే తీరిక దొరకలేదా అని విమర్శించారు.
జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా పోటీ చేస్తుండగా, జడేజా సోదరి నైనబా జామ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా ఉన్నారు. దాంతో, ఈసారి జామ్ నగర్ నార్త్ నియోజకవర్గంలో పోటీ జడేజా ఇంటి పోరుగా మారింది.