దేవుడి విషయంలోనే అవినీతికి పాల్పడితే ఇక సాధారణ మనుషుల విషయంలో ఇంకేముంది. పాపం చేసిన మనిషికి భగవంతుడు ఉన్నాడు పై నుంచి అంతా చుస్తాడు అనే పాప బీతి ఉంటుంది అంటారు. కానీ ప్రస్తుత జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అటువంటి భయాలు ఎవరికీ లేవు అని అర్ధం అవుతుంది. తాజాగా
ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో భారీ అవినీతి భాగోతం బయటపడింది. లడ్డూల తయారీ సరుకు కొనుగోళ్లలో లక్షలాది రూపాయల అవకతవకలు జరిగాయి. లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ. 42 లక్షల గోల్ మాల్ జరిగిందనే విషయాన్ని గుర్తించమని ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. లడ్డూ తయారీకి కాంట్రాక్టర్ సెకండ్ క్వాలిటీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో, మార్కెట్ రేట్ కంటే అధిక ధరకు సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. తమ అంతర్గత విచారణలో ఈ విషయం తెలిసిందని.. ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
లడ్డూ తయారీకి సరుకులు ఇస్తున్న కాంట్రాక్టును రద్దు చేసేందుకు గత నెలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్ లో బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు. అయితే ఇంతవరకు కాంట్రాక్టు రద్దుకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకు కాంట్రాక్ట్ రద్దు చేయలేదని చెప్పారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని.. రానున్న ఫిబ్రవరి, మార్చి నెలలను కూడా కలుపుకుంటే కనీసం రూ. కోటి తేడా వచ్చే అవకాశం ఉందని అన్నారు.