ఇకపై ఆ ప్రభుత్వ వాహనాలు తుక్కుకే.. ఏప్రిల్ 1 నుంచి అమలు

     Written by : smtv Desk | Fri, Jan 20, 2023, 11:37 AM

ఇకపై ఆ ప్రభుత్వ వాహనాలు తుక్కుకే..  ఏప్రిల్ 1 నుంచి అమలు

కొన్ని ప్రభుత్వం వాహానాలు కాలం తీరిపోయినా రోడ్లమీద తిరుగుతూ కదలనని మోదికేయడం మనం చూస్తూనే ఉంటాము. అయితే అటువంటి వాహనాలను చూసిన ప్రభుత్వం వారు స్పందించారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పాత వాహనాలపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేను సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను తుక్కుగా పరిగణించాలని నిర్ణయిచింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనుంది. ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రతకు వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. ప్రాథమిక రిజిస్ట్రేషన్ నమోదై 15 ఏళ్లు పూర్తయిన వాహనాలను చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలని ఉత్తుర్వుల్లో తెలిపింది.

2021-22 కేంద్ర బడ్జెట్ లోనే ఈ విధానాన్ని పేర్కొంది. ఈ విధానం మేరకు వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తరువాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తరువాత ఫిట్ నెస్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫిట్ నెస్ లభించని వాహనాలను తుక్కు కోసం ఇవ్వాల్సి ఉంటుంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. మరి నిర్ణయాలు ఏ మేరకు అమలవుతాయి అనేది వేచి చూడాలి.





Untitled Document
Advertisements