ప్రమాదం ఎప్పుడు ఎవరిని ఎలా వెంటాడుతుంది అనేది ఎవరు ఊహించలేరు. నవ్వుతు అప్పటి వరకు మన కళ్ళముందున్న వ్యక్తులు ఉన్నట్టుండి మన కళ్ళ ముందు నుండి కనుమరుగవుతూ ఉంటారు. అనారోగ్యంతో కావచ్చు. ఆత్మహత్య కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చా.. కారణం ఏదైనా అంతా క్షణాలలో జరిగిపోతుంది. తాజాగా కేరళలోని అలప్పుజ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులంతా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉద్యోగులని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను, క్లీనర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వివరించారు.
సోమవారం తెల్లవారుజామున బియ్యం బస్తాల లోడ్ తో ఆంధ్రప్రదేశ్ నుంచి అలప్పుజ వెళుతున్న లారీ ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన ఐదుగురూ తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటిన్ ఉద్యోగులని వివరించారు. అలప్పుజ నుంచి తిరువనంతపురం వెళుతుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టిందని వివరించారు. కాగా, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం అలప్పుజ మెడికల్ హాస్పిటల్ కు తరలించామని, ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరుపుతామని పోలీసులు వివరించారు.