నేడు ప్రపంచంలోనే మొదటి ‘వేద గడియారం’ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

     Written by : smtv Desk | Fri, Mar 01, 2024, 09:12 AM

నేడు  ప్రపంచంలోనే మొదటి ‘వేద గడియారం’ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి వరకు ఎక్కడ లేనటువంటి 'వేద గడియారాన్ని (Vedic Clock)' నేడు (శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైన ఈ క్లాక్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పద్దతి) ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ క్లాక్‌ని అమర్చారు.

ఈ గడియారం ప్రత్యేకలు ఇవే..
వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ ‘వేద గడియారం’ ప్రదర్శిస్తుంది. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. అంతేకాదు భారత ప్రామాణిక కాలం (IST), జీఎంటీ (GMT)లను ఈ గడియారం సూచిస్తుంది.
గడియారం సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభ గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి ఇతర వివరాలను కూడా అందిస్తుంది.
ఒక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది.

కాగా భారత కాల గణన విధానం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని ఓ ప్రకటనలో నిర్వాహకులు పేర్కొన్నారు. భారత కాల గణన విధానం సూక్ష్మమైనదని, స్వచ్ఛమైనదని, దోషరహితమైనదని తెలిపారు. ప్రామాణికమైన, విశ్వసనీయత కలిగిన ఈ వ్యవస్థను ఉజ్జయినిలో వేద గడియారం రూపంలో తిరిగి ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉజ్జయిని నుంచి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తోందని అన్నారు. భారతీయ కాల గణన సంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గడియారం ద్వారా సామాన్యులు సైతం శుభాశుభ గడియలకు సంబంధించిన వివరాలు సులభంగా తెలుసుకోగలుగుతారు.





Untitled Document
Advertisements