కొత్త మంది సిమ్ కార్డుల చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తున్నాము. ప్రస్తుతం సిమ్ స్వాప్ మోసాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ తరహా మోసాలను అరికట్టడమే లక్ష్యంగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ) సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. దొంగతనానికి గురవ్వడం లేదా డ్యామేజ్ కారణంగా కొత్త సిమ్ కార్డుని తీసుకొని.. ఆ తర్వాత మరొక సిమ్ని కొనుగోలు చేస్తే దానిని వారం రోజుల్లోనే పోర్ట్ చేయడం సాధ్యపడదు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అందిన సిఫార్సులను పరిశీలించామని, వివిధ భాగస్వాములతో చర్చల అనంతరం ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చామని ట్రాయ్ వెల్లడించింది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని వెల్లడించింది. మోసాల కోసం సిమ్ స్వాప్, సిమ్ రీప్లేస్మెంట్లకు పాల్పడుతున్న వ్యక్తుల, సంస్థలకు అడ్డుకట్టవేయడమే తమ లక్ష్యమని వివరించింది.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియలో ‘యూనిక్ పోర్టింగ్ కోడ్’ కీలకమైన దశ అని, తాజా మార్గదర్శకాల ప్రకారం 7 రోజుల వ్యవధిలోనే టెలికం ఆపరేటర్లు యూపీసీ కోడ్ను జారీ చేయలేవని ట్రాయ్ వివరించింది. 8 అంకెలతో కూడిన యూపీసీ కోడ్ విషయంలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టామని వివరించింది. కాగా ప్రస్తుతం వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్ పట్ల అసంతృప్తితో వేరే టెలికం ఆపరేటర్కు మారుతున్న విషయం విషయం తెలిసిందే. ఇందుకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ వినియోగదారులకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధానం కొన్ని మోసపూరిత కార్యకలాపాలకు కూడా తావిస్తోంది. అందుకే వినియోగదారుల ప్రయోజనాల కోసం ట్రాయ్ తాజా మార్పులు తీసుకొచ్చింది.