కొద్దిరోజుల్లో ఏపీలో అసెంబ్లీ మరియు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. అయితే, కోడ్ అమల్లో ఉన్న సమయంలోఎన్నికల కోడ్ నియమావళిని పక్కన పెట్టి పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసిన పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే ఎన్. వెంకట గౌడ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకట గౌడ ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడంటూ ఈసీ చర్యలకు దిగింది.
ఎమ్మెల్యే ఫొటోలతో ఉన్న ప్యాడ్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడాన్ని పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎగ్జామినర్లు గమనించారు. దీనిపై వారు పలమనేరు ఆర్డీవో మనోజ్ రెడ్డికి సమాచారం అందించారు. దాంతో, ఆర్డీవో పలమనేరు ఎమ్మెల్యేపై వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికారులు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు షోకాజ్ నోటీసులు అందించారు. మరి ఈ కేసుపై ఆయన ఏవిధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.