ఎన్నికల ముంగిట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ పవన్ కల్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు.
"వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరు. స్థానికుడు అయి ఒక బీసీ యాదవ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతడిని ఓడించి ఇబ్బందులు పెట్టారు. అలాంటిది వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంట" అని విమర్శించారు. "ప్రజాస్వామ్యంలో నాలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిది. అలాంటిది నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు కుమ్మరిస్తున్నారట. ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారట" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
పిఠాపురంలో తనపై వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారని, అయితే ఆమె ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వంగా గీత 2009లో తమ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారని ఈ సందర్భంలో వెల్లడించారు.