ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 12:28 PM

ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

సమాజంలో జరిగే నేరాలను అరికట్టాల్సిన భాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా నేరాలకు పాల్పడుతున్న అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. నేరాలకు పాల్పడుతున్న వివిధ శాఖలకు చెందిన అధికారులను విధుల నుండి తొలగించడంతో పాటు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. అలా అరెస్ట్ అయిన వారిలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఒకరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈరోజు తీర్పును వెలువరించింది. ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ప్రణీత్ రావు కస్టడీ సరైందేనని చెప్పింది. కింది కోర్టు కస్టడీకి అప్పగించడంపై తాము ఏకీభవిస్తున్నామని తెలిపింది.

పోలీస్ స్టేషన్ లో పడుకోవడానికి సరైన సౌకర్యం లేదని, కస్టడీకి ఇచ్చేముందు నిర్దిష్ట షరతులను విధించలేదని పిటిషన్ లో ప్రణీత్ రావు పేర్కొన్నారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దర్యాప్తులోని అంశాలను కూడా మీడియాకు లీక్ చేస్తున్నారని చెప్పారు. రహస్య విచారణ పేరుతో బంజారాహిల్స్ పీఎస్ లో విచారిస్తున్నారని తెలిపారు. తన బంధువులను, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ కేసు ఏవిధమైన మలుపులు తిరుగుతుంది అనేది పోను పోను చూడాలి.





Untitled Document
Advertisements