రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టిన ఈడీ

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 03:17 PM

రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టిన ఈడీ

గత రాత్రి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసులో నిన్న సాయంత్రం రెండు గంటల విచారణ అనంతరం రాత్రి అరెస్ట్ చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ ఢిల్లీ సీఎం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తారు. తమ తరఫు న్యాయవాది కోర్టులోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టును ఐదు నిమిషాల సమయం కోరారు.

పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఈ పిటిషన్‌పై కేజ్రీవాల్ అభ్యర్థన మీద అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్‌తో క్లాష్ అవుతుందని ముఖ్యమంత్రి తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందుకే పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పుకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు.





Untitled Document
Advertisements