విజయసాయిరెడ్డి, పూర్ణచంద్రరావుల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.. కనకమేడల

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 02:14 PM

 విజయసాయిరెడ్డి, పూర్ణచంద్రరావుల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.. కనకమేడల

ఏపీ ఎన్నికల ముంగిట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కలకలం మొదలైంది. వైజాగ్ లో గంజాయి అడ్డగా మారిందని ఆరోపిస్తూ నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ ఒకటైతే.. తాజగా ప్రభుత్వ సహకారం లేకుండా రూ. 50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను డ్రై ఈస్ట్ పేరుతో ట్రాన్స్ పోర్టు చేయడం సాధ్యమేనా అని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానే డ్రగ్స్ కంటెయినర్ వచ్చిందా అని అడిగారు. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు కూనం వీరభద్రరావు వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావుకు సోదరుడని చెప్పారు. పూర్ణచంద్రరావుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. 2022 అక్టోబర్ 31న బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయి ట్వీట్ చేశారని.. ఆయన ఎందుకు శుభాకాంక్షలు తెలిపారనే విషయాన్ని ఆయన చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
కూనం వీరభద్రరావుకు అంత పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా అని కనకమేడల ప్రశ్నించారు. ఆ కంపెనీ రికార్డులు చెక్ చేశారా అని అడిగారు. ఈ ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలో ఉంటున్నాయని చెప్పారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, సంధ్య కంపెనీకి సంబంధం లేదని అన్నారు. డ్రగ్స్ ను లిక్కర్ కంపెనీలు వాటి ఉత్పత్తుల్లో కలుపుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయని.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాసిరకం లిక్కర్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కనకమేడల ఆరోపణలపై వైసీపీ శ్రేణులు ఏవిధంగా స్పందిస్తాయి అనేది చూడాలి.





Untitled Document
Advertisements