పొరుగు దేశమైన మయన్మార్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తెలిసిందే. అయితే అక్కడ జరుగుతున్న హింస కారణంగా ఆ దేశ సైనికులు ఇటీవల భారత్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిర్మించినట్టే మయన్మార్ సరిహద్దుల్లోనూ ఇనుప కంచె నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ ఘటన జరిగిన వెంటనే ప్రకటించారు.
ఇప్పుడా అంశంపై అమిత్ షా మరింత స్పష్టతనిచ్చారు. చొరబాటుదారులు ప్రవేశించడానికి వీల్లేని విధంగా భారత్-మయన్మార్ సరిహద్దుల పొడవునా మొత్తం 1,643 కిలోమీటర్ల మేర పటిష్ఠమైన ఫెన్సింగ్ నిర్మిస్తామని వెల్లడించారు. దేశ భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మణిపూర్ లో సరిహద్దు ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర కంచెను విజయవంతంగా నిర్మించినట్టు తెలిపారు. ఈ కంచె పొడవునా అధునాతన నిఘా వ్యవస్థలు (హైబ్రిడ్ సర్విలెన్స్ సిస్టమ్) ఏర్పాటు చేస్తామని వివరించారు.