శ్రీలంక గడ్డపై మూడు వన్డేల సిరీస్ని 2-0తో గెలిచిన భారత్ జట్టు.. ఈరోజు నామమాత్రమైన ఆఖరి వన్డేలో ప్రయోగాలు చేయనుంది. కొలంబో వేదికగా గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత మంగళవారం జరిగిన రెండో వన్డేలోనూ 3 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు వన్డేలని ఒకే జట్టుతో ఆడిన టీమిండియా.. సిరీస్ ఇప్పటికే చేజిక్కడంతో మూడో వన్డేకి రెండు మార్పులు చేయాలని యోచిస్తోంది. కొలంబో వేదికగా మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభంకానుంది.
యువ ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్స్ని దూకుడుగా ఆరంభిస్తుండగా.. అతనికి జోడీగా కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడుతున్నాడు. దాంతో.. ఓపెనింగ్ జోడీలో మార్పులు చేసేందుకు టీమిండియా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇక నెం.3 స్థానంలో ఇషాన్ కిషన్కి మరో ఛాన్స్ దక్కడం కూడా లాంఛనమే. అయితే.. నెం.4లో ఆడిన మనీశ్ పాండే.. రెండు వన్డేల్లోనూ కీలక సమయంలో.. అదీ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. అతనిపై వేటు వేయాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మనీశ్ పాండే స్థానంలో సంజు శాంసన్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి.
రెండో వన్డేలో హాఫ్ సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్కి మరో ఛాన్స్ ఇవ్వనుండగా.. రెండు వన్డేల్లోనూ ఫెయిలైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యని ఈ ఆఖరి వన్డేలో ఆడించబోతున్నట్లు సమాచారం. ఇక వైస్ కెప్టెన్ హోదాలో ఉండటంతో భువనేశ్వర్ కుమార్ కూడా ఆడటం లాంఛనమే. అలానే రెండో వన్డేలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన దీపక్ చాహర్ని రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టే సాహసం టీమిండియా మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. కానీ.. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్లో ఒకరిని తప్పించాలని మాత్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుల్దీప్ యాదవ్తో పోలిస్తే.. చాహల్పైనే వేటు పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. చాహల్ స్థానంలో మరో స్పిన్నర్ రాహుల్ చాహర్ని ఆడించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆఖరి వన్డేకి భారత్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్