పేరులోని చివరి అక్షరం పుణ్యమా అని ‘మా’కు రూ.2 లక్షల కోట్ల నష్టం!

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 10:58 AM

పేరులోని చివరి అక్షరం పుణ్యమా అని ‘మా’కు రూ.2 లక్షల కోట్ల నష్టం!

చైనా కుబేరుడు ‘జాక్ మా’కు చెందిన అలీబాబా గ్రూప్ ఆస్తులు ఒకే ఒక్క అక్షరాన్ని హైలెట్ చేస్తూ ప్రసారమైన ఒక వార్తతో లక్షల కోట్ల విలువైన ఆస్తి మంచులా కరిగిపోయాయి. ఎలా అంటారా ‘మా’ అనే చివరి పేరున్న వ్యక్తిని చైనాలో అదుపులోకి తీసుకోవడంతో జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్‌కు బిలియన్ డాలర్లలో నష్టం వాటిల్లింది. ఈ వార్త బయటకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే ‘జాక్ మా’కు చెందిన కంపెనీ షేర్లు 20 శాతం పడిపోయాయి.
విదేశాల్లోని చైనా వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయ్యాడనే అభియోగాలతో దేశ భద్రత కోణంలో ‘మా’ అనే చివరి పేరున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. అలీ బాబా వ్యాపార కేంద్రమైన హాంగ్జౌలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు రావడంతో.. అతడు జాక్ మా కావొచ్చని ప్రజలు భావించారు. దీంతో ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు అలీబాబా గ్రూపులోని తమ షేర్లను అమ్మకానికి పెట్టారు. అలా నిమిషాల వ్యవధిలోనే అలీ బాబా గ్రూప్ దాదాపు 27 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది.
అలీబాబా సొంత నగరమైన హాంగ్జ్వౌలో పోలీసులు ఉన్నారని.. ‘మా’ అనే చివరి పేరున్న వ్యక్తిపై తప్పనిసరి చర్యలు తీసుకున్నారని చైనా ప్రభుత్వానికి చెందిన సీసీటీవీ (చైనా సెంట్రల్ టెలివిజన్) తొలుత ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఇంటర్నెట్ సాయంతో దేశ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలపాలకు ‘మా’ పాల్పడ్డాడని సీసీటీవీ ఆరోపించింది.
ఈ కథనాలతో ఆందోళన చెందిన పెట్టుబడిదారులు అలీబాబా గ్రూపులోని తమ షేర్లను వదిలించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మార్కెట్లో అలీబాబా షేర్ వాల్యూ 27 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇదంతా కేవలం ఓ ప్రచారం కారణంగానే జ రిగిందని నిక్కీ ఆసియా న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
ఇదంతా జరిగిన తర్వాత తాపీగా మేల్కొన్న సీసీటీవీ.. హాంగ్జ్వౌ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి పూర్తి పేరులో మూడు అక్షరాలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. పోలీసులు కూడా ఇదే మాట చెప్పారు. అరెస్టయిన వ్యక్తి జాక్ మా కంటే 20 ఏళ్లు చిన్నవాడని తెలిపారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ హు జిజిన్.. జాక్ మా చైనీస్ పేరు మా యున్‌లో ఉన్నది రెండు అక్షరాలు మాత్రమేనని వైబో ద్వారా వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి చైనా టెక్ కంపెనీలో హార్డ్‌వేర్ రీసెర్చ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడని తేలింది.
2019 చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆ దేశంలో ‘మా’ అనేది 13వ సాధారణమైన ఇంటి పేరు. హాంగ్జ్వౌ సిటీలో 1.2 కోట్ల మంది నివసిస్తుండగా.. ఆ నగరంలో పేరు చివర ‘మా’ అని ఉన్నవారు లక్ష మందికిపైనే ఉన్నారు.
రెండేళ్ల క్రితం చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో జాక్ మా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన అవసరంగా వార్తల్లోకి ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.





Untitled Document
Advertisements