లెజెండరీ తెలుగు హాస్యనటుడు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి శనివారం గండిపేటలో 10 ఎకరాలలో అల్లు స్టూడియోస్ను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతలతో ఈ స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, నిర్మాత బాబీ అల్లు, అల్లు శిరీష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తన మామగారు రామలింగయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఎంతో మంది నటినటులు వస్తుంటారు వెళ్తుంటారు కాని కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు అని అన్నారు. రామలింగయ్య అడుగుజాడల్లో అల్లు కుటుంబం విజయవంతంగా నడుస్తోందని అభినందించారు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ఎదుగుదలకు తన మామగారే కారణమన్నారు.
అల్లు స్టూడియోస్ని ప్రారంభించిన చిరంజీవికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. "మా తాతయ్య వందవ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకమైనది," అని అల్లు అర్జున్ అన్నాడు. స్టూడియో లాభాలను సంపాదించడానికి కాదు, తన తాత యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి స్థాపించబడింది అని అన్నారు. మెగా, అల్లు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ తదితరులు మాట్లాడారు.